TS TET 2022 Preparation Tips: టెట్‌లో మంచి స్కోర్‌ సాధించాలంటే.. సబ్జెక్టుల వారీగా ఈ టాపిక్స్‌ చదవండి

TS TET 2022 పరీక్ష జూన్ 12న జరగనుంది. ఈ టెట్‌ పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లు జూన్‌ 6 నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి. టెట్ పూర్తయిన తర్వాత టీచర్ పోస్టుల భర్తీకి రిక్రూట్‌మెంట్ ఎగ్జామ్ జరగనుంది. ఈసారి టెట్ అర్హతలు, నిర్వహణకు సంబంధించి కొన్ని మార్పులు ఉన్నాయి. గతంలో బీఈడీ అభ్యర్థులు టెట్ పేపర్ 2 మాత్రమే రాసే అవకాశం ఉండేది. డిప్లొమా అభ్యర్థులు టెట్ పేపర్ 1 రాసేవారు. కానీ ఈసారి బీఈడీ అభ్యర్థులు కూడా టెట్ పేపర్ 1 రాయొచ్చు. జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) ఈ మార్పులు చేసింది.

TS TET 2022: గుర్తుంచుకోవాల్సిన తేదీలు

  • దరఖాస్తులు ప్రారంభం: మార్చి 26, 2022
  • దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్ 12, 2022
  • హాల్ టికెట్స్ డౌన్‌లోడ్: జూన్ 6 నుంచి
  • పరీక్ష తేదీ: 2022 జూన్ 12 (పేపర్ 1 ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, పేపర్ 2 మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది)
  • ఫలితాల విడుదల: జూన్ 27, 2022

తెలంగాణలో 80,039 పోస్టుల్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో సెకండరీ ఎడ్యుకేషన్‌లో 13,086 పోస్టులున్నాయి. 6,500 సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ (SGT) పోస్టులు, 2,000 పైగా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, 600 వరకు భాషా పండితుల పోస్టులు ఉన్నాయి. అవసరమైతే మరో 10,000 పోస్టుల్ని కూడా భర్తీ చేస్తామని తెలంగాణ ముఖ్య మంత్రి కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

TS TET 2022 లో విజయం సాధించాలంటే.. ఇవి చదవండి:
చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ పెడగాజి
ఈ విభాగంలో బోధన, లెర్నింగ్‌కు సంబంధించిన ఎడ్యుకేషనల్‌ సైకాలజీ మీద ప్రాథమిక స్థాయిలో ప్రశ్నలు ఉంటాయి. అభ్యర్థులు ప్రధానంగా శిశువు సైకాలజీ సంబంధించిన అంశాలపై ఎక్కువ దృష్టిసారించాలి. వికాస దశలు, వికాస అంశాలైన శారీరక, మానసిక, సాంఘిక, ఉద్వేగ వికాసాలు మొదలైన అంశాలను క్షుణ్నంగా చదవాలి.

శిశువు ప్రవర్తనలో మార్పునకు సంబంధించిన అభ్యాసం, అభ్యసన బదలాయింపు అంశాలను చదవాలి. సైకాలజీ అంశాలను చదివేటప్పుడు కీలక భావనలు, సాంకేతిక పదాలు, సిద్ధాంతాలు– సూత్రాలు, ప్రతిపాదించిన శాస్త్రవేత్తలు, వారి గ్రంథాలు తదితర విషయాలను విశ్లేషణాత్మకంగా చదవాల్సి ఉంటుంది.

ఇక పెడగాజి అంటే బోధన శాస్త్రం. ఇందులో సహిత విద్య, శిశువు విద్యా ప్రణాళిక, బోధన పద్ధతులు, మూల్యాంకనం–నాయకత్వం–గైడెన్స్‌–కౌన్సెలింగ్‌ గురించి అధ్యయనం చేయాలి. ఎడ్యుకేషన్‌కు సంబంధించిన చట్టాలపై పూర్తి అవగాహన పొందాలి. పెడగాజిలోని భావనలు, సిద్ధాంతాలు, నిబంధనలను విశ్లేషిస్తూ అధ్యయనం చేస్తేనే ఏ కోణంలో ప్రశ్న అడిగినా సమాధానం రాయొచ్చు.

లాంగ్వేజ్‌–1
పేపర్‌ 1గా అభ్యర్థులు తెలుగు, ఉర్దు, హిందీ, కన్నడ, మరాఠి, తమిళం భాషలను ఎంచుకోవచ్చు. అభ్యర్థులు ఎంచుకునే సబ్జెక్ట్‌ మీడియంలో లేదా సదరు సబ్జెక్ట్‌ను పదో తరగతి వరకు ఫస్ట్‌ లాంగ్వేజ్‌గా చదివి ఉండాలి. లాంగ్వేజ్‌–2లో ఇంగ్లిష్‌ పేపర్‌ ఉంటుంది. ఈ రెండు పేపర్లు పూర్తిగా ఆయా భాషల్లో నైపుణ్యాలను పరీక్షించే విధంగా ఉంటాయి. భాషా విభాగాలకు సంబంధించిన సాధారణ వ్యాకరణ అంశాలు, బోధన పద్ధతులపై ప్రశ్నలు ఉంటాయి.

స్కూల్‌ స్థాయిలో తెలుగు సబ్జెక్ట్‌ పుస్తకాలతో పాటు తెలుగు బోధన పద్ధతులను చదవాలి. ఇంగ్లిష్‌లో పార్ట్స్‌ ఆఫ్‌ స్పీచ్, ఆర్టికల్స్, డెరైక్ట్‌ అండ్‌ ఇన్‌ డైరెక్ట్‌ స్పీచ్, డిగ్రీస్‌ ఆఫ్‌ కంపేరిజన్, వొకాబ్యులరీ.. ఇలా అన్ని అంశాలపైనా అవగాహన పెంపొందించుకోవాలి. అభ్యర్థులు నిర్దిష్టంగా ఒక ప్రామాణిక పుస్తకాన్ని ఎంచుకుని సిద్ధం కావాలి. పెడగాజికి సంబంధించి టీచింగ్‌ మెథడ్స్, అప్రోచెస్, టెక్నిక్స్, లాంగ్వేజ్‌ స్కిల్స్, ఇంగ్లిష్‌ నేపథ్యం మీద ప్రశ్నలు ఉంటాయి.

మ్యాథమెటిక్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంటల్‌ స్టడీస్‌
ఈ సబ్జెక్టుల్లో ప్రాథమిక అంశాలపై 1 నుంచి 5వ తరగతి స్థాయి వరకు ప్రశ్నలు ఉంటాయి. క్లిష్టత స్థాయి పదో తరగతి వరకు ఉండే అవకాశం ఉంది. ఒక్కో సబ్జెక్టులో ఉన్న 30 ప్రశ్నల్లో 24 ప్రశ్నలు కంటెంట్‌ మీద ఉంటే.. 6 ప్రశ్నలు పెడగాజిపై ఉంటాయి. ఇక పేపర్‌ –2 మ్యాథమెటిక్స్, సైన్స్‌పై ప్రశ్నలు ఉంటాయి. ఆరో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు ఉండే కాన్సెప్టులపైనే ప్రశ్నలు అడుగుతారు. ఎన్విరాన్‌మెంటల్‌ పేపర్‌లో సైన్స్‌ మీద, తెలంగాణ మీద ప్రశ్నలు తప్పనిసరిగా ఉంటున్నాయి. ప్రస్తుతం టెట్‌కు హాజరయ్యే అభ్యర్థులు తెలంగాణ ప్రాముఖ్యం ఉన్న అంశాలను ప్రత్యేక దృష్టితో చదివడం మంచిది.

సైన్స్‌
ఈ విభాగంలో మార్కుల కోసం మూడు నుంచి ఎనిమిదో తరగతి వరకు పుస్తకాలు క్షుణ్నంగా చదవాలి. పేపర్‌–2 కోసం ప్రత్యేకంగా ఆరు నుంచి పదో తరగతి వరకు పుస్తకాలు చదవాలి. గత టెట్‌లో ఈ విభాగంలో ప్రశ్నలు కాసింత క్లిష్టంగానే ఉన్నాయని చెప్పొచ్చు. కాబట్టి అభ్యర్థులు ఆయా అంశాల బేసిక్స్, అప్లికేషన్స్‌ వంటి వాటిపై ప్రత్యేకంగా సాధన చేయాలి

సోషల్‌ స్టడీస్‌
6 నుంచి 8వ తరగతి వరకు పాఠ్య పుస్తకాలను క్షుణ్నంగా చదవాలి. భూగోళ శాస్త్రంలో ఒక ప్రాంతం గురించి చదువుతున్నప్పుడు..ఆ ప్రాంతానికి సంబంధించిన అన్ని అంశాలను చదివాలి. వాతావరణం, భౌగోళిక పరిస్థితులు, నదులు.. వంటి వాటిపై అవగాహన పెంచుకోవాలి. సివిక్స్, ఎకనామిక్స్‌ అంశాలను సమకాలీన అంశాలతో అనుసంధానం చేసుకుంటూ సాధన చేయాల్సి ఉంటుంది.

మెథడాలజీ
ఈ విభాగంలో ప్రధానంగా బోధనా పద్ధతులు; టీచర్‌ లెర్నింగ్‌ మెటీరియల్‌(టీఎల్‌ఎం); బోధన ఉద్దేశాలు, విలువలు, లక్ష్యాలను చదవాలి. పేపర్‌–1, పేపర్‌–2లో అడిగే అంశాలు ఒక్కటే అయినా.. వాటి క్లిష్టత స్థాయిలో తేడా ఉంటుంది. దీన్ని గుర్తించి ప్రిపరేషన్‌ కొనసాగించడం ఉత్తమం.

About the Author

Leave a Reply

*